ప్రసిద్ధ గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీత గాన ప్రచార శంఖారావం’ పేరుతో అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వాషింగ్టన్ లోని సియాటెల్ లో లక్ష్మి వెంకటేశ్వర దేవాలయం లో మూడు రోజులపాటు ( జులై 14,15,16 తేదీలలో ) గీతామృతం పంచనున్నారు.ఈ నేపధ్యం లో గంగాధర శాస్త్రి గారికి ఆతిధ్యo అందించిన శ్రీ జయరాం నండూరి ఇంట్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గళమురళి డాII ఈలపాట శివప్రసాద్, గంగాధర శాస్త్రి ల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది.. దేవాలయ సేవకులు శ్రీ రాంగోపాల్ రెడ్డి వంగపాటి, శ్రీ జయరాం నండూరి, శ్రీమతి కళ్యాణి, ఎల్ విశ్వతేజ లు తమ సంతోషాన్ని పంచుకున్నారు. శ్రీ కె.శివప్రసాద్ – గంగాధర శాస్త్రిని దుశ్శాలువా తో సత్కరించి ‘గీత ప్రచార లక్ష్యం’ సఫలీకృతం కావాలని ఆశీర్వదించారు. అమెరికా లో తన గీతా గాన ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేయదలుచుకున్న వారిని శ్రీ శేఖర్ రావు బసవ రాజు – +1(817)675-3404 ; శ్రీ ఆజాద్ బాబు +91 9866296699 లను సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు.
భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు కుమార్తె, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి దీపా వెంకట్ హైదరాబాద్ లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, సేవాసంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను ఈ రోజు (25.6.2023) సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డా. ఎల్ వి గంగాధర శాస్త్రి మరియు ఫౌండేషన్ సభ్యులు ఆమెకు స్వాగతం పలికారు. శ్రీకృష్ణుని విగ్రహానికి ఆమె పుష్పమాలను సమర్పించి, శ్రీ గంగాధర శాస్త్రి ని – విశ్వరూపం తో రూపొందించిన శంఖాన్ని బహూకరిస్తూ దుశ్శాలువతో సత్కరించారు. అటుపై భగవద్గీతా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాల గురించి శ్రీ గంగాధర శాస్త్రి ఆమెకు లఘుచిత్ర ప్రదర్శన ద్వారా వివరించారు. సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ సమయం లో శ్రీ వెంకయ్య నాయుడు స్టూడియో కి వచ్చి, ‘విశ్వరూపసందర్శన యోగం’ అధ్యాయం విని, తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్న అనుభూతిని తనతో పంచుకున్న విషయాన్ని శ్రీ గంగాధర శాస్త్రి దీపా వెంకట్ కు చెప్పారు. ఆమెను వేదపండితుల ఆశీస్సులతోను దుశ్శాలువతో ను, భగవద్గీత తోను సత్కరిస్తూ, స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా చేస్తున్న సేవలను ప్రశంసించారు
మానవ జీవితం లో జననం నుంచి మరణం వరకు మనకు తెలియకుండా చేసే శారీరిక, వాచిక, మానసిక దోషాలతో కూడిన కర్మలనుండి, మాతృ, పితృ దోషాలనుండి విముక్తుల్ని చేయగలిగిన పవమాన ప్రయోగ హోమాన్ని ఉప్పల్, హైదరాబాద్ లోని శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్టు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి అతిథి గా హాజరయ్యారు. యజ్ఞదానతపః కర్మ నత్యాజ్యం కార్యమేవతత్/యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషీణామ్ (గీత – 18-5) అని గీతాచార్యుడు చెప్పినట్టు మానవ జన్మను పావనం చేసే యజ్ఞము, దానము, తపస్సు అనే మూడు సత్కర్మలను ప్రతిమానవుడూ ఆచరించవలసిందేనని గంగాధర శాస్త్రి అన్నారు. మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైన ఉందని అన్నారు. గో సంరక్షణ తో పాటు యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ లోకశ్రేయస్సును కాంక్షించే శ్రీ శంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్టు సేవలను కొనియాడారు. సంస్థ వ్యవస్థాపకులు శ్రీ కుప్పా శ్రీనివాస స్వామి ని అభినందించారు. ఈ వ్యవస్థ కు చేయూతనందించడం ద్వారా హైందవ సంస్కృతిని, ధర్మాన్నీ కాపాడవలసింది గా భక్తులను, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖను కోరారు. అనంతరం గంగాధర శాస్త్రి దంపతులు గో సేవలో పాల్గొన్నారు.
అమెరికాలో నివసిస్తూ శబ్దబ్రహ్మొపాసకులు గా ప్రసిద్ధి పొందిన అవధాని బ్రహ్మశ్రీ పాలడుగు శ్రీచరణ్ హైదరాబాద్ లోని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీచరణులకు స్వాగతం పలికి ‘భగవద్గీత’ తో సత్కరించారు. అటుపై ఆధ్యాత్మిక విషయాల పైన చర్చించారు. ఈ సమావేశం లో ప్రసిద్ధ జ్యోతిష పండితులు శ్రీ దంటు శ్రీనివాస్, శ్రీ బి బి కె ప్రసాద్, ఫౌండేషన్ అడ్వొకసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు లు పాల్గొన్నారు.
ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లోని “మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం” “గౌరవ డాక్టరేట్ ” ప్రకటించింది.
భారతీయ సంస్కృతి ని, సంస్కృత విద్యను పరిరక్షించడం లో భాగంగా – పరిశోధనాత్మక కృషి చేసి, భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితంగా గాన చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి, అంతటితో తన భాధ్యత తీరిపోయిందని భావించకుండా – స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారమే తన జీవితంగా మలుచుకున్నందుకు శ్రీ గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ ” ను ప్రకటిస్తున్నట్లు పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సి.జి .విజయకుమార్ తెలియజేసారు.
మే 24, 2023 ఉదయం 11 గంటలకు కోఠీ మార్గ్ లోని విక్రం కీర్తి మందిరం, ఉజ్జయిని (మధ్యప్రదేశ్ ) లో జరిగే ‘మహర్షి పాణిని సంస్కృ త్ ఏవం వైదిక్ విశ్వవిద్యాలయం’ నాల్గవ స్నాతకోత్సవం లో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సన్మానించనున్నట్లు రిజిస్ట్రార్ డాII దిలీప్ సోని తెలిపారు.
ఈ సందర్భం గా గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఎల్.వి. గంగాధర శాస్త్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ –
మధ్యప్రదేశ్ గవర్నర్, ఆ రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాల కులపతి అయిన శ్రీ మంగుభాయ్ పటేల్ కు, మహర్షి పాణిని విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ విజయ్ కుమార్ సి.జి కు, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు, ఉన్నత విద్యా శాఖా మంత్రి శ్రీ మోహన్ యాదవ్ లకు వినమ్ర పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
కాగా – ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా తాను 17 ఏళ్లుగా చేస్తున్న కృషిని గుర్తించిన భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ ఛార్జ్, తెలుగువాడైన శ్రీ పి. మురళీధరరావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా తనకీ గౌరవం దక్కిందని, అందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు.
సంస్కృత వ్యాకర్త అయిన ‘పాణిని మహర్షి ‘ పేరు తో స్థాపించిన విశ్వవిద్యాలయం నుంచి ఈ గౌరవం పొందడం సముచితంగా, అదృష్టంగా భావిస్తున్నానని గంగాధర శాస్త్రి అన్నారు. తనకు లభించిన ఈ గౌరవం – తనకు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, 17 ఏళ్ళ తన భగవద్గీతా ప్రయాణం లో సహకరించిన భార్యాబిడ్డలకు, మార్గ నిర్దేశకత్వం చేసిన గురువులకు, సాంకేతిక నిపుణులకు, ప్రపంచం నలుమూలల నుండి చేయూతనందించిన భగవద్గీత అభిమానులకే చెందుతుందని, తాను కేవలం శ్రీ కృష్ణుడు ఉపయోగించుకున్న సాధనం మాత్రమేనని గంగాధర శాస్త్రి అన్నారు.
స్వార్థ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ‘భగవద్గీత’ పునాదుల పై నిర్మించిన లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్ ‘ ద్వారా గీతా ప్రచారం తో పాటు –
* పేద విద్యార్థులకు, అనాధ బాలలకు, వికలాంగులకు , వృద్ధాశ్రమాలకు చేయూత
* గోసేవ, యోగ శిక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణ
* ఆయుర్వేద, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ
వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకులు గంగాధర శాస్త్రి చెప్పారు.
ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఆధ్యాత్మిక సామాజిక సేవా క్షేత్రంగా తెలుగునాట ‘ భగవద్గీతా యూనివర్సిటీ ‘ స్థాపనే పరమ లక్ష్యం గా ‘భగవద్గీతా ఫౌండేషన్’ కృషి చేస్తుందని చెబుతూ – మతాలకు అతీతమైన జ్ఞాన గ్రంథం ‘భగవద్గీత’ ను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని, గీతను బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించాలని కోరారు.
గతం లో శ్రీ గంగాధర శాస్త్రి సినిమా జర్నలిస్టు గా, సినీ నేపధ్య గాయకుడుగా, సంగీత కార్యక్రమాల సమర్పకుడు గా, ప్రయోక్త గా కొనసాగుతున్న తరుణం లో పరివర్తన చెంది, అప్పటి వరకూ తాను చేసిన జీవిత ప్రయాణపు దిశను మార్చుకుని ఆధ్యాత్మిక మార్గం లోకి ప్రవేశించారు. తెలుగు వాడైన ఘంటసాల కొంతమేరకు గానం చేసిన భగవద్గీతను సంపూర్ణం గా గానం చేసి, ఆయనకు అంకితమిచ్చి గురు ఋణం చెల్లించుకున్నారు. ‘భగవద్గీత జీవన గీత – మరణ గీత కాదు.’అన్న నినాదం తో సాగుతున్న గంగాధర శాస్త్రి కృషిని శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ స్వామి, దివంగత రాష్ట్రపతి డా II ఏ పి జె అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్రమోడీ, శ్రీ రాంనాథ్ కోవింద్ వంటి వారు ప్రశంసించారు. గతం లో – గీత ద్వారా గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ తో సత్కరించింది.
“మనం చేసే కర్మలు ధర్మబద్ధమైనవి అయి ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ అనుగ్రహం సంపూర్ణం గా ఉంటుంది. ధర్మ మార్గం లో ఉన్న ఏ భక్తుడు అనన్య భక్తి తో పరమాత్మ ను ధ్యానిస్తాడో అట్టి వారి యోగక్షేమాలు తానే చూసుకుంటానని పరమాత్మ చెబుతాడు. ఇక్కడ యోగం అంటే పొందని దానిని పొందుట, క్షేమం అంటే పొందినదానిని రక్షించుట అని ఆది శంకరుల భాష్యం. ఏ దేవతను ఆరాధించినా అది తనను ఆరాధించినట్టేనని చెబుతూ ఆయా దేవతలు తన అనుగ్రహం వల్లనే ఫలాలను ఇస్తారని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. తిరగలిలో దగ్గరగా ఉండే గింజలు నలగవు. అలాగే పరమాత్మకు దగ్గరగా ఉండే వానికి నాశనము లేదు. ‘న మే భక్త: ప్రణశ్యతి’ అన్నది పరమాత్మ వాక్యం… గీతను బాల్య దశనుండే పిల్లలకు నేర్పించండి. ఈ దేశం గొప్పతనం, ఇక్కడి ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత రూపం లో పిల్లలకు నేర్పించండి. ఇలా తెలియ చేయకపోవడo వల్లే పిల్లలు తల్లి తండ్రులను, ఈ దేశాన్ని వదిలేసి కేవలం డబ్బుకోసం ఇతర దేశాల వెంట పరుగెడుతున్నారు. ఉత్తమ జీవన విధానాన్ని, ఆదర్శవంతమైన సమాజాన్ని ఏర్పరుస్తుంది భగవద్గీత. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యం గా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది భగవద్గీత. భగవద్గీతను ప్రచారం చేయడమంటే మతాన్ని ప్రచారం చెయ్యడమని కాదు. ధర్మాన్నీ, జ్ఞానాన్ని ప్రచారం చెయ్యడం…! మానసిక, శారీరక, వాచిక ఆరోగ్యాలను కాపాడి ఉన్నతమైన మార్గాన్ని చూపుతుంది గీత.. ” అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి… నల్గొండ జిల్లా నకిరేకల్ లోని షిరిడి సాయిబాబా సంస్థాన్ ప్రాంగణం లో (29.4. 2023) ఆయన గీతా గాన ప్రవచనం చేశారు. భగవద్గీత శ్లోకాలు పఠించిన చిన్నారులను, వారికి శిక్షణనిచ్చిన గురువు శ్రీమతి సుమలత ను ఆశీర్వదించారు. తమకు ఆత్మీయ ఆతిధ్యం అందించిన శ్రీ రాంబాబు, తులసి దంపతులకు, ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన ప్రతి ఒక్క సభ్యునికి కృతజ్ఞతలు తెలియజేసారు. ట్రస్టు చైర్మన్ శ్రీ కోసం లింగయ్య, సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి దంపతులను సత్కరించారు.
అమెరికా లోని ప్రసిద్ధ తెలుగు సాంస్కృతిక సంస్థ నాట్స్ ( NATS – NORTH AMERICAN TELUGU SOCIETY ) ‘అమెరికా తెలుగు సంబరాలు -2023’ పేరుతో మే 26,27,28 తేదీలలో న్యూజెర్సీ లో సాంస్కృతిక సంబరాలు జరుపబోతోంది. ఇందులో తొలి రోజు కార్యక్రమం గా ‘ఘంటసాల శతజయంతి’ జరుపబోతున్నారు. ఇందులో ప్రసిద్ధ గాయకులు, గీతా గాన ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధరశాస్త్రి ని ‘ఘంటసాల శతజయంతి విశిష్ట పురస్కారం’ తో సత్కరించనున్నారు. ఇందుకోసం – నాట్స్ కన్వీనర్ శ్రీ శ్రీధర్ అప్పసాని, కో కన్వీనర్ శ్రీ రాజశేఖర్ అల్లాడ, ఈటీవీ ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ దర్శకులు శ్రీ అనిల్ కడియాల లు శ్రీ గంగాధర శాస్త్రిని హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయo లో కలిసి ఆహ్వానించారు. ఘంటసాల గాన వైభవాన్ని దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ, ఆయన ప్రారంభించిన భగవద్గీతను పూర్తి చేస్తూ, 9 సంవత్సరాల పరిశోధనాత్మక కృషి చేసి, స్వీయ సంగీతం లో సంపూర్ణం గా గానం చేసి, రికార్డు చేసి, తనకు స్ఫూర్తినిచ్చిన ఘంటసాలకు అంకితం చేస్తూ విడుదల చేసి, అంతటి తో తన పని పూర్తి అయిపోయిందని భావించకుండా, స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన తొలి భారతీయ గాయకుడిగా గంగాధరశాస్త్రి కి ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి ఫౌండేషన్ అడ్వొకసీ చీఫ్ శ్రీ అజాద్ బాబు వివరించారు. గంగాధర శాస్త్రి వారిని తాను గానం చేసిన భగవద్గీత తో సత్కరించారు.
‘భగవద్గీతా సందేశాన్ని పట్టణాలలో, నగరాలలో కంటే – మతమార్పిడులు అధికం గా జరుగుతున్న గ్రామాలలోనే విస్తృతం గా ప్రచారం చేయాలి. మానవీయ విలువలతో పాటు ఉత్త్తమ మానవ జీవన విధానమంతా భగవద్గీతలోనే ఇమిడి ఉంది. మానవుడు భగవద్గీత అనే నావను ఆశ్రయిస్తే ఘోరమైన సంసార సాగరాన్ని సులభం గా దాటివేయగలడని వైష్ణవీయ తంత్ర సారం చెబుతుంది. భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది. దేవుడు కోరికని బట్టి కాదు. అర్హతని బట్టి ఇస్తాడు. ఆ అర్హతని సాధించాలంటే ధర్మ మార్గం లో నడవాలి. భగవద్గీత లో మొదటి పదం ‘ధర్మం’… చివరి పదం ‘మమ’… ఈ రెండూ కలిపితే ‘మమ ధర్మం’ అవుతుంది. అంటే ప్రతి ఒక్కడూ తన ధర్మాన్ని తను తెలుసుకుని ఆచరిస్తే పరమాత్మ అనుగ్రహాన్ని తప్పక పొందినట్టే. కర్మను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి తప్ప మొక్కుబడిగా చేస్తే సత్ఫలితాలను సాధించలేమని భగవద్గీత చెబుతుంది. ప్రతి ఒక్కరూ దైవభక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ఠ, నిష్కామ కర్మల ఆంతర్యం తెలుసుకుని ఆచరిస్తే జన్మ చరితార్ధమవుతుందని గ్రహించాలి. ప్రతి దేవాలయం లోనూ నిత్యమూ భగవద్గీత ప్రదర్శింపబడాలి. అందుకొరకే మేము స్థాపించిన ‘భగవద్గీతా ఫౌండేషన్’ ద్వారా 9 సంవత్సరాల పరిశోధనాత్మక కృషి చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో, భారత దేశపు తొలి సంగీత భరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతను రూపొందించడం జరిగింది. గ్రామ గ్రామాలలోనూ గీతా సత్సంగాలు, గీతా బోధనలు జరగాలి. మానసిక వత్తిడిని జయించాలంటే, ఆత్మహత్యలు లేని ప్రపంచాన్ని చూడాలంటే, లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే, స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించాలంటే, భారత దేశానికి పూర్వ వైభవం తీసుకు రావాలంటే బాల్య దశ నుండే భగవద్గీతను అభ్యసించాలి. భగవద్గీత మత గ్రంథమూ, వృద్ధాప్యపు పఠనా గ్రంథమూ కాదు. మానవీయ విలువలతో కూడిన జ్ఞాన గ్రంథం. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్, వారన్ హేస్టింగ్స్, ఐనిష్టియన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే వంటి పాశ్చాత్యులు సైతం భగవద్గీత ను మతాలకు అతీతమైన ఉపదేశం గా పేర్కొన్నారు. సనాతన ధర్మానికి పునాది భగవద్గీత..! గీత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే ఇతర మతాల దాడులను ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. హిందువులకు హిందూయిజం పట్ల సరిఅయిన అవగాహన, నమ్మకం లేకపోవడం వల్లే మతమార్పిడులు, దాడులు, దేవాలయాల కూల్చివేతలు, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి దురదృష్టకర సంఘటనలను చూడవలసివస్తోంది. హిందువులారా లేవండి. మేలుకోండి. లక్ష్యం చేరుకునేంతవరకూ విశ్రమించకండి.” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ఏలూరు జిల్లా కలిదిండి గ్రామం లోని “ఆధ్యాత్మిక మహా మండలి” సంస్థ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినo సందర్భం గా, జిల్లాపరిషత్ హై స్కూల్ ప్రాంగణం లో (22.3.2022) ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమం లో శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా జ్ఞాన గానామృతాన్ని పంచారు.కలిదిండి గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఈ కార్యక్రమానికి గ్రామస్థులను ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భం గా ఆధ్యాత్మిక మహా మండలి అధ్యక్షులు శ్రీ నంబూరి విజయ నరసింహరాజు (బాండు రాజు), శ్రీ మద్దూరి శేషగిరి రావు, శ్రీ అగ్నిహోత్రం ఆత్రేయబాబు తదితర సభ్యులు మరియు గ్రామస్థులు శ్రీ గంగాధర శాస్త్రి ని దుశ్శాలువ తో, పట్టు వస్త్రం తో ‘గీతా వాచస్పతి’ బిరుదుతో ఘనం గా సత్కరించారు.
ఎన్టీఆర్ అంటే రాముడు .. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు … ఎన్టీఆర్ అంటే తెలుగు భాష …. ఎన్టీఆర్ అంటే తెలుగుజాతి ఆత్మగౌరవం.. ఎన్టీఆర్ అంటే నటుడుగా సంపాదించుకున్న శక్తిని రాజకీయం అనే సేవ ద్వారా ప్రజల హృదయాలలో స్థిరస్థానం ఏర్పరచుకున్న కారణజన్ముడు! అలాగే అమృత గానం అంటే ఘంటసాల … ఈ ఇద్దరు తెలుగు మహనీయులనూ దయచేసి ‘భారత రత్న’ తో గౌరవించండి.” అని భారత ప్రభుత్వాన్ని కోరారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. తాను సంగీతభరిత సంపూర్ణ భగవద్గీతను రికార్డు చేయడానికి ఈ ఎన్టీఆర్, ఘంటసాలలే స్ఫూర్తి అన్నారు. గాన సుధాకర్ స్థాపించిన ‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సంస్థ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాన్ని హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో నిర్వహిస్తూ ఎన్టీఆర్ అవార్డు ను ‘గాత్ర కంఠీరవ’ సాయికుమార్ కు అందజేశారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి – ఎన్టీఆర్, ఘంటసాలలకు నివాళిగా శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం లోని ‘నను భవదీయ దాసుని’ పద్యాన్ని ఆలపించారు. ఔచిత్యభరితమైన నటనతో, అద్భుతమైన గాత్రం తో ఘన కీర్తిని సంపాదించుకుని ఎన్టీఆర్ ప్రశంసలు పొందిన సాయికుమార్ ‘ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారానికి’ ముమ్మాటికీ అర్హులు అన్నారు. తమ భగవద్గీతా ఫౌండేషన్ రూపొందించిన “The Making of Bhagavadgita Documentary ” కి సాయికుమార్ గాత్రo అందించడాన్ని ఈ సందర్భంగా కృతజ్ఞతలతో గుర్తుచేసుకున్నారు. హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసారు.
కంచి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి హైదరాబాద్ లోని స్కందగిరి దేవాలయం లో బస చేసిన సందర్భం లో – భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి కుటుంబ సమేతం గా స్వామి ని దర్శించి ఆశీస్సులు పొందారు. తమ భగవద్గీత రికార్డింగ్ సమయం లో కంచి కి వచ్చి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారిని కలిసి ఆశీస్సులు పొందిన సందర్భాన్ని గుర్తు చేస్తూ వీడియో చూపించి, తమ భగవద్గీతా ఫౌండేషన్ చేస్తున్న, చేపట్టిన కార్యక్రమాలను స్వామి వారికి వివరించారు. ఈ సందర్భం గా భక్తి గానాన్ని వినిపించమని స్వామి కోరగా – గంగాధర శాస్త్రి – లింగాష్టకం, శివతాండవ స్తోత్రం, శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం, శ్యామలా దండకం (మహాకవి కాళిదాసు), జయ జయ మహాదేవ శంభో హరా శంకరా (కాళహస్తిమహాత్మ్యం), నీలకంధరా దేవా (భూకైలాస్), భగవద్గీతా శ్లోకాలను గానం చేశారు. అనంతరం విజయేంద్ర సరస్వతి స్వామి గంగాధర శాస్త్రి దంపతులను దుశ్శాలువ తోను సత్కరించి కుమారుడు విశ్వతేజ, కుమార్తె కీర్తిప్రియల ను ఆశీర్వదించారు. గంగాధర శాస్త్రి ని ఆశీర్వదిస్తూ – భగవద్గీత ప్రచారానికే జీవితం అంకితం చేయడం పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యిందని, హర్యానా లోని కురుక్షేత్రం లో భగవద్గీతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందని, అందుకు తమ సహకారం కూడా ఉంటుందని, 27 చరణాలు గల ‘శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రాన్ని కూడా ప్రచారం చేయవలసిందని సూచించారు.