‘నాకు గాయకుడు గా స్ఫూర్తినిచ్చింది, అవకాశాలు తెచ్చిపెట్టింది, గుర్తిపుతెచ్చింది, గౌరవం సంపాదించిపెట్టింది, భాషా సంస్కారం నేర్పింది, సినినేపధ్య గాయకుడుగా అవకాశం కల్పించింది, చివరకు నా జీవితానికి అర్ధం, పరమార్ధం చెప్పి సంపూర్ణ భగవద్గీతా గానం ద్వారా శాశ్వతత్వాన్ని ప్రసాదించింది … ఘంటసాల పాటే..! ఆ పాట మాధుర్యాన్ని నాకు బాల్యం లో రుచి చూపించిన మా తండ్రి గారు శ్రీ కాశీవిశ్వనాధ శర్మ గారికే ఈ అవార్డు అంకితం … !’ అన్నారు ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘గోవింద గీతికలు’ సంస్థ శ్రీ గంగాధర శాస్త్రి ని ‘ఘంటసాల – జీవిత కాల సాఫల్య పురస్కారం’ తో సత్కరించిన సందర్భం గా ( పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (24.1.2023) ఆయన గాన ప్రసంగం చేశారు. ఘంటసాల పాట లో ఉన్న మాధుర్యం ఆర్ద్రత, పవిత్రత, పరమ శాంతి తన హృదయం పై బాల్యం లో చెరగని ముద్ర వేసిందని గంగాధర శాస్త్రి అన్నారు. ఘంటసాల భగవద్గీత గానం చేసి ఉండకపోతే తాను దానిని సంపూర్ణం గా గానం చేయాలనే ఆలోచన వచ్చి ఉండేది కాదని, ఘంటసాల పాటలు తేలిగ్గా రావని, సాధన చేయడం వల్లే వస్తాయని, తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోకాలు, దండకాలు పిల్లలకు నేర్పాలంటే ఘంటసాల గాత్రాన్ని రుచి చూపించాలని అన్నారు. అలాగే ఇదే వేదికపై ‘నటసామ్రాట్ ఏ ఎన్నార్ శతజయంతి సిల్వర్ క్రౌన్’ పురస్కారాన్ని ప్రముఖ సినీ హీరో శ్రీ సుమన్ అందుకున్నారు. హీరో గా, దేముడి గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణమైన పాత్రలు పోషించి మెప్పించిన నటుడు శ్రీ సుమన్ అని గంగాధర శాస్త్రి చెబుతూ తాను జర్నలిస్ట్ గ ఉన్న రోజులనుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమను సత్కరించిన ‘గోవింద గీతికలు’ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి గీతకు కృతజ్ఞతలు తెలియజేసారు. ‘కళ’ పత్రిక సంపాదకులు శ్రీ మహ్మద్ రఫీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.