గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చెప్పిన గీతాశ్లోకాలను మోరిస్విల్ మేయర్ శ్రీ టి జె కాలి తిరిగి ఉచ్చరించారు. గంగాధర శాస్త్రి ఆయనకు కుంకుమ తిలకం దిద్ది, తాను గానం చేసిన సంపూర్ణ భగవద్గీతా గాన పేటికను జ్ఞాపిక గా అందించగా, టి జె కాలి శ్రీ గంగాధర శాస్త్రి కి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. నార్త్ కరోలినా రాష్ట్రం లో, కారీ పట్టణం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో (23.9. 2023) శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. నిత్య జీవితం లో భగవద్గీత ను అన్వయించుకుని ఎలా ఆచరించాలో, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకుని సర్వ మానవాళిని సన్మార్గం లో నడిపించడం కోసం చేసిన కర్తవ్య బోధా రహస్యాన్ని శ్రీ గంగాధర శాస్త్రి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రేక్షకులు ఆసాంతం గీత ను భక్తి శ్రద్ధలతో విని పులకించారు. శ్రీ వేంకటేశ్వర దేవాలయాన్ని SV TEMPLE గా పిలువ వద్దని, పూర్తి పేరుతో పిలవాలని సూచించారు. వేంకటేశ్వర నామం బాధలను హరించే ఈశ్వర నామం గా గుర్తెరగాలని అన్నారు. అలాగే కృష్ణ అనే నామం కూడా అత్యంత శక్తివంతమైనదని, దానిని పూర్తి గా పలకాలని, సౌలభ్యం కోసం ‘క్రిష్’ గా కత్తిరించి పలకడo ద్వారా కృష్ణ నామ ఫలితాన్ని పొందజాలమని అన్నారు. క్రిష్ అనే ధాతువునకు ఆకర్షించుట అని అర్ధమని, ‘ణ’ అనేది ఆనంద వాచకమని, అందరిని ఆకర్షించే నిత్యానంద స్వరూపుడు కాబట్టి ఆయన కృష్ణుడయ్యాడని గంగాధర శాస్త్రి అన్నారు. మానవ జన్మను పవిత్రం చేసే పుణ్య కర్మలైన యజ్ఞ దాన తపస్సులను ప్రతి ఒక్కరూ ఆచరించాలని గీత చెబుతోందని అన్నారు. శ్రీ గంగాధర శాస్త్రి విశ్వరూప సందర్శన యోగాన్ని తాత్పర్యం తో గానం చేస్తున్నప్పుడు ఆర్ద్రత నిండిన హృదయాలతో చెమర్చిన కళ్ళతో ప్రేక్షకులు కరతాళధ్వనులు సలిపారు. తల్లి తండ్రులు ‘గీత’ను బాల్య దశనుండే తమ పిల్లలకు నేర్పించడం ద్వారా సనాతన ధర్మాన్ని తరువాత తరాలకు అందించాలని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీత కేవలం పఠనా గ్రంథం కాదని, అర్ధం చేసుకుని ఆచరించి తరించవలసిన గ్రంథమని అన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ కమిటీ చైర్మన్ డాII రాజ్ పోలవరం కు గంగాధర శాస్త్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పవన్ ఎర్రంశెట్టి, డా. వల్లి కొడాలి, శ్రీ సతీష్ గరిమెళ్ళ ల సహకారాన్ని ప్రశంసించారు. భగవద్గీతా ఫౌండేషన్ కు చేయూతనందించడం తో పాటు తనకు ఆత్మీయ ఆతిధ్యం అందించిన శ్రీమతి లావణ్య, శ్రీ గోపాల్ కేతముక్కల దంపతులకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతం గా నిర్వహించిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయo పాలక మండలి అధ్యక్షులు శ్రీ సునిల్ కొల్లూరు ను అభినందించారు. శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రవచనం ద్వారా తమను మరో లోకానికి తీసుకు వెళ్లి మరిచిపోలేని దివ్యమైన అనుభూతి ని పంచిపెట్టారని శ్రీ సునీల్ కొల్లూరు అన్నారు. ఈ కార్యక్రమం లో తానా, టాటా, ట్యూటా, టి టి జి ఏ, హెచ్ ఎస్ ఎన్ సి సంస్థలు తమ సహకారం అందించాయి. ఈ సందర్భం గా బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి ని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం సభ్యులు ఘనం గా సత్కరించారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A