‘భగవద్గీతా సందేశాన్ని పట్టణాలలో, నగరాలలో కంటే – మతమార్పిడులు అధికం గా జరుగుతున్న గ్రామాలలోనే విస్తృతం గా ప్రచారం చేయాలి. మానవీయ విలువలతో పాటు ఉత్త్తమ మానవ జీవన విధానమంతా భగవద్గీతలోనే ఇమిడి ఉంది. మానవుడు భగవద్గీత అనే నావను ఆశ్రయిస్తే ఘోరమైన సంసార సాగరాన్ని సులభం గా దాటివేయగలడని వైష్ణవీయ తంత్ర సారం చెబుతుంది. భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది. దేవుడు కోరికని బట్టి కాదు. అర్హతని బట్టి ఇస్తాడు. ఆ అర్హతని సాధించాలంటే ధర్మ మార్గం లో నడవాలి. భగవద్గీత లో మొదటి పదం ‘ధర్మం’… చివరి పదం ‘మమ’… ఈ రెండూ కలిపితే ‘మమ ధర్మం’ అవుతుంది. అంటే ప్రతి ఒక్కడూ తన ధర్మాన్ని తను తెలుసుకుని ఆచరిస్తే పరమాత్మ అనుగ్రహాన్ని తప్పక పొందినట్టే. కర్మను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి తప్ప మొక్కుబడిగా చేస్తే సత్ఫలితాలను సాధించలేమని భగవద్గీత చెబుతుంది. ప్రతి ఒక్కరూ దైవభక్తి, దేశభక్తి, కర్తవ్య నిష్ఠ, నిష్కామ కర్మల ఆంతర్యం తెలుసుకుని ఆచరిస్తే జన్మ చరితార్ధమవుతుందని గ్రహించాలి. ప్రతి దేవాలయం లోనూ నిత్యమూ భగవద్గీత ప్రదర్శింపబడాలి. అందుకొరకే మేము స్థాపించిన ‘భగవద్గీతా ఫౌండేషన్’ ద్వారా 9 సంవత్సరాల పరిశోధనాత్మక కృషి చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యున్నత సాంకేతిక విలువలతో, భారత దేశపు తొలి సంగీత భరిత, తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీతను రూపొందించడం జరిగింది. గ్రామ గ్రామాలలోనూ గీతా సత్సంగాలు, గీతా బోధనలు జరగాలి. మానసిక వత్తిడిని జయించాలంటే, ఆత్మహత్యలు లేని ప్రపంచాన్ని చూడాలంటే, లంచాలు లేని భారతదేశాన్ని సృష్టించాలంటే, స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించాలంటే, భారత దేశానికి పూర్వ వైభవం తీసుకు రావాలంటే బాల్య దశ నుండే భగవద్గీతను అభ్యసించాలి. భగవద్గీత మత గ్రంథమూ, వృద్ధాప్యపు పఠనా గ్రంథమూ కాదు. మానవీయ విలువలతో కూడిన జ్ఞాన గ్రంథం. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్, వారన్ హేస్టింగ్స్, ఐనిష్టియన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే వంటి పాశ్చాత్యులు సైతం భగవద్గీత ను మతాలకు అతీతమైన ఉపదేశం గా పేర్కొన్నారు. సనాతన ధర్మానికి పునాది భగవద్గీత..! గీత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే ఇతర మతాల దాడులను ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. హిందువులకు హిందూయిజం పట్ల సరిఅయిన అవగాహన, నమ్మకం లేకపోవడం వల్లే మతమార్పిడులు, దాడులు, దేవాలయాల కూల్చివేతలు, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి దురదృష్టకర సంఘటనలను చూడవలసివస్తోంది. హిందువులారా లేవండి. మేలుకోండి. లక్ష్యం చేరుకునేంతవరకూ విశ్రమించకండి.” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. ఏలూరు జిల్లా కలిదిండి గ్రామం లోని “ఆధ్యాత్మిక మహా మండలి” సంస్థ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినo సందర్భం గా, జిల్లాపరిషత్ హై స్కూల్ ప్రాంగణం లో (22.3.2022) ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమం లో శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా జ్ఞాన గానామృతాన్ని పంచారు.కలిదిండి గ్రామానికి చెందిన కొందరు మహిళలు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఈ కార్యక్రమానికి గ్రామస్థులను ఆహ్వానించడం విశేషం. ఈ సందర్భం గా ఆధ్యాత్మిక మహా మండలి అధ్యక్షులు శ్రీ నంబూరి విజయ నరసింహరాజు (బాండు రాజు), శ్రీ మద్దూరి శేషగిరి రావు, శ్రీ అగ్నిహోత్రం ఆత్రేయబాబు తదితర సభ్యులు మరియు గ్రామస్థులు శ్రీ గంగాధర శాస్త్రి ని దుశ్శాలువ తో, పట్టు వస్త్రం తో ‘గీతా వాచస్పతి’ బిరుదుతో ఘనం గా సత్కరించారు.
.