లాంగ్ ఐలాండ్, అమెరికా లోని తన స్వగృహం లో తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జయ్ తాళ్లూరి, శ్రీమతి నీలిమ దంపతులు శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని, శివ విష్ణు దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ రఘు శర్మ గారి అద్వర్యం లో అత్యంత వైభవం గా (16.9. 2023) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి గారిని విశిష్ట అతిథి గా ఆహ్వానించారు. ‘భక్తి యోగం’ పైన శ్రీ గంగాధర శాస్త్రి గాన ప్రవచనం చేస్తూ ఘంటసాల, అన్నమయ్య కీర్తనలు పాడుతూ కల్యాణానికి హాజరైన జయ్ తాళ్ళూరి బంధు మిత్రులతో గోవింద భజన చేయించారు.
‘ప్రపంచం లో ప్రతి ఒక్క మతమూ తమది జీవన విధాన మార్గమనే చెబుతుంది… హిందూ మతం పేరుతో పిలువబడే సనాతన ధర్మం మాత్రం ఉత్తమ జీవన విధాన మార్గమని గుర్తించాలి. మిగతా మత గ్రంథాలు వ్యక్తు ల చేత రచించబడినవి. సనాతన ధర్మ సారాంశమైన ‘భగవద్గీత’ ఆ పేరులోనే చెప్పబడినట్టు గా సాక్షాత్తు భగవానుని ముఖపద్మం నుండి వెలువడిన కర్తవ్యోపదేశం గా గుర్తెరగండి. ఇది వ్యక్తి ఆరాధనా గ్రంథం కాదు. సిద్ధాంత గ్రంధము. సహేతుకం గా, విశ్లేషణాత్మకం గా పరిశీలిస్తే ఇది సర్వజన ఆమోదయోగ్య మైన బోధ అని తెలుస్తుంది.. ఇది ఆచరణకు మిక్కిలి సులభము… శాశ్వతము. అందుకే గీత ను అధ్యయనం చేయండి. అర్ధం చేసుకోండి. ఆచరించండి. సత్ఫలితాలను పొందండి.. బాల్య దశ నుండే పిల్లలకు నేర్పించండి. జీవితాన్ని ఎలా అందం గా, ఆనందం గా, ఆదర్శవంతం గా, స్ఫూర్తి దాయకం గా, మానసిక వత్తిడి లేకుండా గడపాలో తెలియజెప్పండి. ఉత్తమ సమాజాన్ని నిర్మించండి.” అన్నారు. గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి కాన్సస్ సిటీ ( అమెరికా )లో (11.9. 2023) న శ్రీమతి సరితా పాండురంగారావు గృహం లో ఏర్పాటైన సత్సంగం లో పాల్గొని గీతా సారం పైన గాన ప్రవచనం చేశారు. సరితా పాండురంగారావులు తమ కుమార్తె చిII శ్రీనిధి కి 5 వ తరగతి నుండే కీర్తనలు, భగవద్గీత శ్లోకాలు నేర్పించడాన్ని అభినందిస్తూ ఆశీర్వదించారు. ఇక్కడి తెలుగు వారికి పెద్ద దిక్కుగా ఉంటూ భారతీయ సంస్కృతికి చేయూతనందిస్తున్న డాII రంగినేని రాజ గోపాల్, శ్రీమతి అరుణ లకు గంగాధరశాస్త్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. హిందూ దేవాలయం ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఈ సత్సంగానికి హాజరయ్యారు. ఆ మరు రోజు శ్రీ గంగాధర శాస్త్రి శ్రీమతి రాధిక, శ్రీనుకుమార్ గాదిరాజు గృహం లో అతిధ్యం స్వీకరించారు.
‘గర్భం లో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు.. తల్లిగర్భంలోనే విష్ణు తత్వం విని ప్రహ్లాదుడు పరమ వైష్ణవ భక్తుడైనట్టు … తల్లి గర్భం లో ఉన్నప్పుడే శిశువుకు భగవద్గీతను వినిపిస్తే – ఈ లోకం లోకి వచ్చాక లౌకిక మైన కర్మలను ఆచరిస్తూనే ఆధ్యాత్మ జ్ఞాని అవుతాడు. భవబంధాలకు తావు లేకుండా కర్మలను ఆచరించ గలుగుతాడు. మానసిక వత్తిడి లేని ఆరోగ్యవంతుడు గా జీవితం కొనసాగిస్తాడు. నిస్వార్ధం గా లోకహితం కోసం కర్మలను ఆచరిస్తాడు. తనని శాశ్వతుడిని చేసే కర్మల పట్ల ఆసక్తి చూపుతాడు. లక్ష్యం చేరుకోవడం కోసం చేసే ప్రయాణాన్ని అనుక్షణం ఆస్వాదించగలుగుతాడు. భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునుడి కి ఉపదేశించిన ప్రతీ శ్లోకమూ సకల మానవాళి కి ఉపయోగపడే ఒక్కో జీవిత పాఠం … ! అందుకే కనీసం బాల్యదశ నుండైనా మీ పిల్లలకు భగవద్గీతామృతాన్ని రుచి చూపించండి.. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. సందేహం లేదు.’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘అద్దం ముందు నిలబడితే మనం భౌతికం గా ఎలా ఉంటామో మాత్రమే తెలుస్తుంది. భగవద్గీత అనే అద్దం ముందు నిలబడితే మన తత్త్వ మేమిటో తెలుస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టి, చేసే కర్మలను బట్టి మనం సాత్త్వికులమో, రాజసికులమో, తామసికులమో అర్ధమవుతుంది. మన తప్పుటడుగుల్ని సరిచేసి, మనల్ని మనం ఉద్ధరించుకునే అవకాశం కల్పిస్తుంది గీత..!’ అన్నారు గంగాధర శాస్త్రి. నిత్యజీవితానికి భగవద్గీత ను అన్వయిస్తూ సాగిన ప్రవచనం ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. అమెరికా లోని కాన్సస్ సిటీ లోని “తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ” వారు ఘనం గా నిర్వహించిన (10.9.2023) కార్యక్రమంలో డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చేసిన స్ఫూర్తిదాయకమైన గీతా గాన ప్రవచనాన్ని ప్రేక్షకులు మంత్రముగ్ధులై విన్నారు. ఈ సందర్భం గా అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి గాన ప్రవచనా సరళి పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ”గీతా గాన కౌస్తుభ” బిరుదు తో ఘనం గా సత్కరించారు. కార్యక్రమానికి రూపకల్పన చేసి, నడిపించిన తీరు అద్వితీయమని శ్రీ గంగాధర శాస్త్రి అసోసియేషన్ సభ్యులను ప్రశంసిస్తూ – బోర్డు చైర్ పర్సన్, శ్రీ అమ్మిరెడ్డి శ్రీధర్, ప్రెసిడెంట్ శ్రీ నరేంద్ర దుద్దెల, వైస్ ప్రెసిడెంట్ శ్రీ చంద్ర శేఖర్ యక్కలి, బోర్డు సభ్యులు శ్రీ శ్రీనివాస్ పెనుగొండ, శ్రీ శివ తియ్యగూర, కోశాధికారులు శ్రీ ఫణి కుమార్, శ్రీ ఉదయ్, శ్రీమతి శ్రావణి మేక, శ్రీ విశేష్ రేపల్లె, శ్రీమతి సరిత, పాండురంగ, శ్రీమతి రాధికా గాదిరాజు, శ్రీనుకుమార్, లకు కృతజ్ఞతలు తెలియజేసారు. తమ తెలుగు భగవద్గీత కు చేయూత నందించడమే గాక, ఆత్మీయ ఆతిధ్యం అందిస్తూ ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తలు గా వ్యవహరించి, ఘన విజయం చేకూర్చిన వదాన్యులు శ్రీ రాజగోపాల్, శ్రీమతి అరుణ రంగినేని లకు డా గంగాధర శాస్త్రి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు. కార్యక్రమానికి ముందు హిందూ దేవాలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు మహేంద్రాడ నిర్వహణలో హిందూ దేవాలయం లోని శ్రీవెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై గణపతి కీర్తన తో పాటు, భగవద్గీత శ్లోకాలు గానం చేసిన చిII శ్రీనిధి ని గంగాధర శాస్త్రి అభినందన పూర్వక ఆశీస్సులందించారు.
సెయింట్ లూయీస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ నిర్వాహకులు, భగవద్గీతా బంధువు శ్రీ స్వర్ణ ప్రసాద్ స్వగృహం లో ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి చే భగవద్గీత లోని ‘కర్మ యోగం’ పై ప్రవచనం ఏర్పాటయింది.(26.8.2023). ఆ సందర్భం గా కొన్ని దృశ్యాలు ఇక్కడ…..
అమెరికా తిరుపతి గా ప్రసిద్ధి గాంచిన పిట్స్ బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం లో భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్ధాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా గాన ప్రవచనం చేశారు.(1.9.2023) కర్మ భక్తి జ్ఞాన మార్గాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం గా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గం లో నడిపించడానికి చేసిన కర్తవ్య బోధే భగవద్గీత అని శ్రీ గంగాధర శాస్త్రి అన్నారు. ఇది కేవలం హిందువులకు మాత్రమే పరిమితమైన బోధ కాదని సకల మానవాళికి ఉపయుక్తమైనదని అన్నారు. భగవద్గీత చదవాల్సింది వృద్ధాప్యం లో కాదని బాల్యదశ నుంచే అని, చదివి, అర్ధం చేసుకుని, ఆచరించి, ప్రచారం చేయడం భగవద్గీత పరమార్ధమని భావించాలని అన్నారు. కర్మ ను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తుందన్నది గీతోపదేశం పరమార్ధమని గంగాధర శాస్త్రి అన్నారు. విశ్వరూప సందర్శన యోగం లోని శ్లోకాలను గానం చేస్తున్నప్పుడు గంగాధర శాస్త్రి తో పాటు ప్రేక్షకులు కూడా చెమర్చిన కళ్ళతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ ట్రస్టీ శ్రీ కొత్తపల్లి శ్రీనివాస్ కి గంగాధర శాస్త్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెలిజియస్ ఛైర్ శ్రీ కళ్యాణ్ స్వాగత వచనాలు పలుకగా, ఎక్సిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీ ప్రభానంద్ యడ్ల మాట్లాడుతూ – ఒక గాయకుడు భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీతను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితం గా 9 ఏళ్ల పాటు గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, విడుదల చేసి, అంతటితో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, భగవద్గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేయడం భారతీయ సంగీత చరిత్రలో ఇదే ప్రథమమని, శ్రీ గంగాధర శాస్త్రి తెలుగువాడు కావడం గర్వకారణమని చెబుతూ వేదికకు ఆహ్వానించారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీమాన్ గోపాల భట్టర్, శ్రీమాన్ సముద్రాల వెంకటాచార్యులు, ఆలయ బోర్డు సభ్యులతో కలిసి శ్రీ గంగాధర శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. తొలుత ఆలయ మర్యాదలతో కమిటీ సభ్యులు శ్రీ గంగాధర శాస్త్రి కి స్వాగతం పలికి శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భం గా సౌండ్ ఇంజినీర్ శ్రీ కార్ల్ ను గంగాధర శాస్త్రి ప్రత్యేకం గా అభినందించారు. కార్యక్రమ ప్రారంభం లో శ్రీ గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
సెయింట్ లూయిస్, అమెరికా లోని ‘ప్రవాస గాయత్రి సమాఖ్య’ ఆధ్వర్యం లో మహాత్మా గాంధీ సెంటర్ లో జరిగిన (27.8. 2023) ‘గీతా గాన ప్రవచనం’ కార్యక్రమంలో ప్రజలు అత్యధిక సంఖ్య లో పాల్గొని ఘన విజయం చేకూర్చారు. ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి తన గీతా గాన ప్రవచనం లో భగవద్గీత తో పాటు ఘంటసాల, అన్నమయ్య భక్తి గీతాలతో, భజనలతో రెండున్నర గంటలసేపు ప్రేక్షకులకు స్పూర్తినిస్తూ గీతా మార్గం లో ప్రయాణించారు. ”అమెరికన్స్ తో పాటు కలిసి మెలుగుతున్న భారతీయుల పిల్లలు ఒక పక్క తమ తల్లి తండ్రుల సంస్కృతిని, మరోపక్క అమెరికన్స్ జీవన విధానాన్ని అర్ధం చేసుకుంటూ నడవడం లో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని, తత్కారణం గా అశాంతి పెరిగి పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గంగాధర శాస్త్రి అన్నారు. దీనికి పరిష్కారం – బాల్యదశ నుండే మన పిల్లలకు స్వధర్మాన్ని, సంప్రదాయాలను, భగవద్గీతను తెలియజేయడం ఒక్కటే అని, మన సంస్కృతిని, మాతృ భాషను తరువాత తరం వారికి తెలియజేయాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని ‘శ్రేయాన్ స్వధర్మో విగుణః’ అనే గీతా శ్లోకాన్ని తాత్పర్య సహితం గా శ్రీ గంగాధర శాస్త్రి గుర్తు చేస్తూ వివరించారు. ‘గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే’ అని చెబుతూ గీత లో అతి ముఖ్య శ్లోకాలను నిజ జీవితం లో ఆచరించడం ద్వారా మానసిక వత్తిడి లేని ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపవచ్చని అన్నారు. తనకీ అవకాశం ఇచ్చిన శ్రీ ప్రసాద్ స్వర్ణ కు గంగాధర శాస్త్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదం చేసిన శ్రీ నారాయణ బొమ్మిరెడ్డిపల్లి, శ్రీ వెంకట్ ధర్మవరపు, శ్రీ హరి కావూరి, రవి ప్రకాష్ శ్రీపాద, శ్రీ సాయి స్తబ్నవిస్ లకు ధన్యవాదాలు తెలియజేసారు. ప్రసిద్ధ నాట్యకళాకారిణి, నాట్యాచారిణి శ్రీమతి అర్చన ఉపమాక సుమధురమైన తెలుగు లో వ్యాఖ్యానం అందించారు. ప్రసిద్ధ నాట్యాచారిణి శ్రీమతి సుజాత వింజమూరి, శ్రీమతి సునీత ధర్మవరపు, శ్రీమతి నీలిమ స్వర్ణ, శ్రీమతి ప్రియా నందనవనం, శ్రీమతి లావణ్య కావూరి, శ్రీమతి మాధవి స్తబ్నవిస్ లు జ్యోతి ప్రకాశనం చేసిన అనంతరం శ్రీ ప్రసాద్ స్వర్ణ – భగవద్గీతా వ్యాప్తి కి శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని వివరిస్తూ ఆయనను వేదికకు ఆహ్వానించారు. శ్రీ శ్రీనివాస ఐనాపురపు – గంగాధరు జూటము విడి /పొంగుచు యేతెంచెనేమొ పుష్కరవేళన్ /జంగమ తీర్థపు గళమున /సంగమమైనట్టి గంగ చప్పున మెఱిసెన్ / అంటూ తన పద్య రత్న మాలతో గంగాధర శాస్త్రి ని సత్కరించారు. శ్రీ జయరాం అద్దేపల్లి, శ్రీమతి జయంతి లు స్ప్రింగ్ ఫీల్డ్ నుంచి మూడున్నర గంటల రోడ్డు ప్రయాణం చేసి ఈ కార్యక్రమానికి హాజరై దివ్యమైన అనుభూతిని, భగవద్గీతా స్ఫూర్తిని పొందామని అన్నారు. యూట్యూబ్ వీడియోలు చూసిన స్ఫూర్తి తో శ్రీ గంగాధర శాస్త్రి గీతా ప్రవచనాన్ని ప్రత్యక్షం గా వినేందుకు సుదూరాలనుంచి అభిమానులు తరలిరావడం విశేషం.
కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరం లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ( VEDA TEMPLE ) ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన ప్రచారకర్త డా. ఎల్. వి. గంగాధర శాస్త్రి ని అయన రెండు రోజుల గీతా గాన ప్రవచనం అనంతరం ‘భగవద్రత్న భగవద్గీతర్షి’ బిరుదుతోను, ప్రశంసా పత్రం తోను, స్వర్ణకంకణం తోను ఘనo గా సత్కరించింది. VEDA TEMPLE వ్యవస్థాపకులు, ప్రసిద్ధ వేద పండితులు, జ్యోతిష శాస్త్రజ్ఞులు, సుకవి బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి శ్రీ గంగాధర శాస్త్రిని – ప్రశంసా పత్రం చదివి, వేద ఆశీర్వచనo తోను పట్టు వస్త్రాలతోనూ సత్కరించారు. ‘సిలికానాంధ్ర’ వ్యవస్థాపకులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ చేత శ్రీ గంగాధర శాస్త్రి కి స్వర్ణ కంకణ ధారణ చేయించారు. సంస్కృతాంధ్రాలలో అపారమైన విద్వత్సంపన్నుడు అమెరికా లో స్థిరపడిన ద్విసహస్రాధాని బ్రహ్మశ్రీ పాలడుగు శ్రీచరణ్ ఈ రెండు రోజుల కార్యక్రమానికి విశిష్ఠ అతిధి గా హాజరై గీతాప్రచారం కోసం శ్రీ గంగాధర శాస్త్రి చేస్తున్న కృషిని కొనియాడుతూ … ఆనయాతాద్యశోదాత్మ / గోవిందోయం జనార్దనః / లక్కావఝల వంశాబ్ధి / గ్లౌ గంగాధర శాస్త్రిణమ్ / వంటి పద్యరత్నాలతో ఆశీర్వదించారు. శ్రీ గంగాధర శాస్త్రి నిత్య జీవితం లో భగవద్గీత ఆవశ్యకత గురించి స్ఫూర్తిదాయకం గా వివరిస్తూ, గీతా గానం చేస్తూ, మధ్య మధ్యలో ఘంటసాల భక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు, భజనలు గానం చేశారు. విశ్వరూప సందర్శన యోగం లోని శ్లోకాలను గానం చేస్తూ తాత్పర్యం చెబుతున్నప్పుడు ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయం గా తాము చేస్తున్న భగవద్గీతా ప్రచారానికి, భగవద్గీతా ఫౌండేషన్ కి చేయూతనందించవలసిందిగా శ్రీ గంగాధర శాస్త్రి కోరుతూ, తనకు ఉత్తమమైన వేదిక, ఆత్మీయ ఆతిధ్యం అందించడం తో పాటు ఫౌండేషన్ కు చేయూతనందించడం లో కృషి చేసిన బ్రహ్మశ్రీ నాగ వెంకట శాస్త్రి దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. తన కార్యక్రమం గురించి తెలుసుకుని విచ్చేసిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఉపాధ్యాయుల రాధాకృష్ణ, శ్రీ శ్రీనివాస మూర్తి, కతార్ దేశ వాస్తవ్యలు శ్రీ ఆదిత్య దంపతుల కు గంగాధర శాస్త్రి ధన్యవాదాలు తెలియజేసారు.
‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీతా ప్రచార కార్యక్రమాల కోసం అమెరికా లో పర్యటిస్తూ శాన్ డియాగో కు చేరుకున్నారు. ఆయనను ఆహ్వానించిన ‘గీతా ఫౌండేషన్’ అమెరికా శాఖ అధ్యక్షులు డాII రాధాకృష్ణ తమిరిసా, గీతా బంధువు శ్రీ ప్రవీణ్ పురాణం తో కలిసి ఆ రోజు (11.8.2023) లహోయా సముద్రపు ఒడ్డున భగవద్గీతా కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఆమార్గం లో ఒక బెంచ్ మీద కూర్చుని, దూరం నుంచి తెల్ల చొక్కా తెల్ల లుంగీ ధరించిన గంగాధర శాస్త్రి ని గమనిస్తున్న ఒక అమెరికన్ యువకుడు గంగాధర శాస్త్రి దగ్గరకు వెళ్లి ‘నమస్తే … నా పేరు అలెక్స్ .. శాండియాగో లోని ఒక స్టార్ హోటల్ లో సీనియర్ షెఫ్ గా పనిచేస్తున్నాను. నాకు కాబోయే భార్య జిల్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ …ఎందుకో మిమ్మల్ని చూడగానే పరిచయం చేసుకోవాలని అనిపించింది. మీరు ఇండియన్ కదూ.. నాకు ఇండియన్ స్పిరిట్యువాలిటీ అంటే చాలా ఇష్టం..’ అంటూ పరిచయం చేసుకున్నాడు. అతనితో గంగాధర శాస్త్రి కాసేపు సంభాషించారు. భగవద్గీత సారాంశం వివరించారు. ఈ లోపు డాII రాధాకృష్ణ, శ్రీ ప్రవీణ్ లు మరుసటి రోజు జరిగే గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం కార్యక్రమానికి ఆహ్వానించారు. అలెక్స్ తనకు కాబోయే శ్రీమతి జిల్ తో శివ విష్ణు దేవాలయానికి వచ్చాడు. శ్రీ ప్రవీణ్ పురాణాన్ని అనువదించమని కోరి మరీ రెండు రోజుల గీతా గాన ప్రవచన కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తి శ్రద్ధలతో ఆనందించారు అలెక్స్, జిల్ దంపతులు.. గంగాధర శాస్త్రి భజనలు చేయించినప్పుడు అలెక్స్ దంపతులు భక్తి పారవశ్యం తో కరతాళ ధ్వనులతో భజనలు చేశారు. కార్యక్రమం మొత్తాన్ని జిల్ తన కెమెరా లో భద్రపరుచుకుంది… ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలలో ఆమె కనిపిస్తున్న ఫోటోలు తప్ప మిగిలినవన్నీ ఆమె తీసినవే… ఎక్స్ప్రెషన్స్ ని క్లిక్ చేయడం తన ప్రేత్యేకత అని చెప్పింది జిల్ … రెండురోజుల ప్రవచన కార్యక్రమం అనంతరం గంగాధర శాస్త్రి అలెక్స్ దంపతులను దుశ్శాలువతో సత్కరించి పండ్లు అందించారు. ఆ సమయం లో అలెక్స్ అశ్రునయనాలతో భావోద్వేగానికి గురయ్యాడు. ‘నన్ను మీ శిష్యుడు గా స్వీకరిస్తారా.. నేను మీతో భారత దేశానికి వచ్చి సేవచేయడానికి సిద్ధం గా ఉన్నాను. నేను హిందువు గా మారిపోతాను ‘ అని అభ్యర్ధించాడు. అందుకు గంగాధర శాస్త్రి… ” మత మార్పిడులు మా అభిమతం కాదు. మతం తల్లి లాంటిది. మతం మారే ప్రయత్నం తల్లిని వదిలిపెట్టడం లాంటిది. అది అమానుషమైన చర్య. హిందువులు ఇలాంటి అకృత్యాలకు ఒడిగట్టరు … మనమందరం ఒక్కటే. మన అందరికి ఒక్కడే’ అనేది హిందూ ధర్మ సిద్ధాంతం.. మాది మతం కాదు. ధర్మం .. మీరు అమెరికా లోనే ఉండండి. మీ మాతృభూమిని వదిలిపెట్టొద్దు. ఆదర్శ దంపతులుగా మెలగండి. భారతీయులు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళండి.. ఆధ్యాత్మిక సారాన్ని అర్ధం చేసుకోవడానికి, అటుపై ఆచరించడానికి ప్రయత్నించండి. మీరు సంపాదించే ధనాన్ని కొంత సమాజ సేవకు ఖర్చుపెట్టండి. మీ పిల్లలను దైవ భక్తి, దేశభక్తి కలిగి ఉండేలా, కుటుంబ వ్యవస్థ పై గౌరవం పెరిగేలా పెంచండి… సమాజానికి స్ఫూర్తి అందించేలా ఎదగండి.” అంటూ ఆశీర్వదించారు. మొత్తంమీద శాండియాగో లో జరిగిన శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచన కార్యక్రమానికి వచ్చిన తెలుగు వారి మధ్య అమెరికా జంట అలెక్స్, జిల్ లు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ‘గీత-వ్యక్తిత్వ వికాసం’ అనే అంశం పై స్ఫూర్తిదాయకo గా చేసిన భగవద్గీతా గాన ప్రసంగానికి ప్రేక్షకులు విశేషం గా స్పందించారు. గీతాచరణ ద్వారా నిత్యజీవితాన్ని వత్తిడికి దూరం గా ఎలా ఆనందమయం చేసుకోవచ్చో గంగాధర శాస్త్రి వివరించారు. మనకు నచ్చిందని ఏదిపడితే అది చేసుకుంటూ పోరాదని, అది శాస్త్రసమ్మతమై ఉండాలని, ఆ శాస్త్రమే గీతా శాస్త్రమని, ‘తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్య వ్యవస్థితౌ’ అన్న పరమాత్మ వాక్కు మానవ జాతికి అనుసరణీయమని గంగాధరశాస్త్రి అన్నారు, ఈ కార్యక్రమం ‘హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియో’ లో 30.7.2023 న ఉదయం జరిగింది. దేవాలయ కార్యవర్గం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక స్వాములు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ గంగాధర శాస్త్రి కి తీర్థ ప్రసాదాలు అందించారు. డాII మీనాక్షి శ్రీ గంగాధర శాస్త్రి స్వాగత వచనాలతో వేదికపైకి ఆహ్వానించారు. గీతా గాన ప్రవచనం అనంతరం దేవాలయ పాలకమండలి చైర్మన్ శ్రీ రామకృష్ణ జూలుకుంట్ల, డా మీనాక్షి, శ్రీ కేదార్నాథ్ చింతపల్లి దంపతులు, శ్రీ రాజేశ్వర రావు టేకుమళ్ళ, శ్రీ గంగాధర శాస్త్రి ని సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు గంగాధర శాస్త్రి ఆశీస్సులు తీసుకుని ఫోటోలు దిగారు. ప్రవచనం కార్యక్రమానికి ముందు శ్రీమతి జయంతి కోట శిక్షణలో, బాలబాలికలు భగవద్గీత లోని ‘భక్తి యోగము’ పఠించగా గంగాధర శాస్త్రి ఆశీరభినందనలు అందించారు. తనకు ఆత్మీయ ఆతిధ్యం ఇచ్చిన శ్రీ రాజేశ్వర రావు టేకుమళ్ళ, శ్రీమతి జ్యోతి దంపతులకు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు.