Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

భారత రాష్ట్రపతి గౌII శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు-2023″ ను అందుకున్న గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

ప్రసిద్ధ గాయకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి – భారత రాష్ట్రపతి గౌII శ్రీమతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు-2023″ ను అందుకున్నారు. సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలను, స్వీయ సంగీతం లో, తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, లోకార్పణ చేసినందుకు ‘భారతీయ ప్రధాన సాంప్రదాయ సంగీత విభాగం లో ఆయనను ఈ అవార్డు తో భారత ప్రభుత్వం గౌరవించింది. ఈ కార్యక్రమం న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో మార్చ్ 6, 2024 న జరిగింది. గౌ II రాష్ట్రపతి తో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామాత్యులు శ్రీ జి కిషన్ రెడ్డి, కేంద్ర చట్టము మరియు న్యాయ మంత్రిత్వ శాఖ, పార్లమెంట్ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచ, కేంద్ర సాంస్కృతిక శాఖ సెక్రటరీ శ్రీ గోవింద్ మోహన్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. కార్యక్రమానంతరం శ్రీ గంగాధర శాస్త్రి పాత్రికేయులతో మాట్లాడుతూ – ” గతం లో డా ఏ పి జె అబ్దుల్ కలాం గారికి నా భగవద్గీత వినిపించి ప్రశంసలు పొందడం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘కళారత్న’, మధ్యప్రదేశ్ లోని పాణిని యూనివర్సిటీ నుంచి ‘గౌరవ డాక్టరేట్’, ఇప్పుడు భారత రాష్ట్రపతి గౌ II శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ‘సంగీత నాటక అకాడమీ’ అవార్డు అందుకోవడం, అందునా నా తల్లితండ్రులు ఆరోగ్యం గా ఉన్నప్పుడే ఈ జాతీయ అవార్డు అందుకోవడం అసలైన ఆనందాన్నిస్తోంది. ఈ SNA అవార్డు నా ‘గీతా’ పరిశ్రమను గుర్తించి శ్రీ జి కిషన్ రెడ్డి గారు అందించినదిగా భావిస్తాను. జన్మనిచ్చిన తల్లితండ్రులకు, మాతృభూమికి, మాతృదేశానికి ఇంతకంటే తిరిగి ఏమివ్వగలను … ఈ అవార్డులూ ప్రశంసలూ అన్ని నా భగవద్గీతా మార్గానికే రావడం ఆత్మానందాన్ని కలగజేస్తోంది. ఇది ఏదీ నా ఒక్కడి ప్రతిభ కాదు. నేను నిమిత్తమాత్రుడిని.. అనుకోని నా గీతా ప్రయాణమంతా కృష్ణ పరమాత్ముని సంకల్పం.. నా తల్లి తండ్రుల తపఃఫలం..! అయితే నా పరమ లక్ష్యం మాత్రం అవార్డులు కాదు. – ‘ఇంటింటా గీతా జ్యోతులు వెలగాలి. ముఖ్యం గా ఈ దేశం లోని ప్రతి ఒక్క హిందువూ భగవద్గీత చదవాలి … అర్ధం చేసుకోవాలి… ఆచరించాలి… తరువాత తరాలకు అందించాలి.. తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడాలి…! భారతీయ ఆధ్యాత్మికత దేశ కాల జాత్యాదులకు అతీతమైనది. కుల మత వర్గ లింగ విభేదాలకు తావులేనిది .. దీనిని ప్రపంచ వ్యాప్తం చేయడం ద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్నీ, విశ్వ శాంతినీ సాధించవచ్చు.. అప్పుడే మాకు అసలైన ఆనందం. మా లాంటి ధర్మ ప్రచారకుల వ్యవస్థల గురించి తెలుసుకుని ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. చేయూతకోసం మేము ప్రభుత్వాలను అర్ధించే పరిస్థితి ఉండరాదు. గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించాలి. పాఠశాల ల్లో పాఠ్య అంశం గా భగవద్గీతను చేర్చాలి. అప్పుడే మనం మన దేశ అస్థిత్వాన్ని కాపాడుకున్నట్టు. భగవద్గీతను మతం అనే కోణం నుంచి చూడవద్దు. అలా ఐతే ఇంగ్లీషు నేర్చుకోవడం క్రైస్తవం అవుతుంది కదా…!. అందరినీ సమానం గా చూడమని చెప్పే ధర్మ మూర్తులు శ్రీరాముడు, శ్రీకృష్ణులకు జన్మనిచ్చిన భారత భూమిపై పుట్టినందుకు గర్వపడతాను.” అన్నారు గంగాధర శాస్త్రి. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఛైర్పర్సన్ శ్రీమతి సంధ్య పురేచా శ్రీ గంగాధర శాస్త్రిని దుశ్శాలువతో సత్కరిస్తూ – త్వరలో తమ అకాడమీ తరపున గీత ద్వారా ధర్మ ప్రచార కార్యక్రమాలను కూడా వేదికలపైన నిర్వహించబోతున్నట్టు చెబుతూ అందుకు గంగాధర శాస్త్రి సహకారాన్ని కోరారు.

గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త డా।। ఎల్ వి గంగాధర శాస్త్రి కి కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు….

ప్రసిద్ధ గాయకులు, భగవద్గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి కి భారత దేశపు ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సంగీత నాటక అకాడమీ’ అవార్డు లభించింది. 2023 సంవత్సరానికి గాను – ఇతర ప్రధాన సంప్రదాయ సంగీత విభాగం లో ఆయనకు ఈ ‘అకాడమీ పురస్కారం’ లభించింది. తాను అభ్యసించిన కర్ణాటక శాస్త్రీయ సంగీతం తో – భారత దేశపు ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలలో ఘంటసాల స్వరపరచి పాడిన 108 శ్లోకాలను ఆయన గౌరవార్థం యథాతథం గా పాడడం తో పాటు, మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతం లో, తెలుగు తాత్పర్య సహితం గా గానం చేసి, అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేసి, ‘భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత’ గా శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామి, డాII ఏ పి జె అబ్దుల్ కలాం చేతులమీదుగా విడుదల చేసి, అంతటి తో తన బాధ్యత తీరిపోయిందని భావించకుండా, స్వార్ధ రహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసినందుకు గంగాధర శాస్త్రి కి ఈ అవార్డు దక్కింది. ఈ మహత్కార్యం చేసినందుకు గతం లో శ్రీ గంగాధర శాస్త్రి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న'(హంస) పురస్కారం తోను, మధ్యప్రదేశ్ లోని ‘మహర్షి పాణిని యూనివర్సిటీ’ ‘గౌరవ డాక్టరేట్’ తోను సత్కరించింది. కాగా ఇప్పుడీ అవార్డు ప్రకటించిన నేపధ్యం లో – ‘గీత’ పట్ల తన అంకిత భావాన్ని గత 16 సంవత్సరాలుగా గుర్తిస్తూ వచ్చిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, అలాగే సంగీత నాటక అకాడమీ’ అకాడమీ చైర్మన్ డాII సంధ్య పురేచ కు, జ్యూరీ సభ్యులకు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కు గంగాధర శాస్త్రి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇది తనకు తొలి జాతీయ అవార్డు అన్నారు. ఈ అవార్డు – పాట నేర్పిన తన తల్లి తండ్రులకు, ‘గీతా గాన మార్గదర్శి’ ఘంటసాల కు, గీతా సద్గురువులకు, శాస్త్రీయ సంగీతం నేర్పిన గురువులకు అంకితమన్నారు. ‘భగవద్గీత’ అంటే భారతదేశపు ఆలోచనా విధానమని, ఇది మతాలకు అతీతమైన, సర్వజనామోదయోగ్యమైన, ఆచరణీయమైన, అత్యుత్తమమైన కర్తవ్య బోధ అనీ, దీనిని ప్రతి ఒక్కరూ చదివి, అర్ధం చేసుకుని, ఆచరించడం ద్వారా స్వార్ధరహిత ఉత్తమ సమాజాన్ని ఏర్పరచవచ్చని, అందుకే తమ ‘భగవద్గీతా ఫౌండేషన్’ ద్వారా గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతను జాతీయ గ్రంథం గా ప్రకటించడం ద్వారా ఈ దేశపు జ్ఞాన సంపదను గౌరవించాలని భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలనూ కోరుతున్నామని, గీతను పాఠ్యాంశం గా చేర్చి బాల్య దశ నుంచే పిల్లలకు నేర్పించడం ద్వారా, మానవీయ విలువలను పెంపొందించవచ్చని ఆయన అన్నారు. ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణం ద్వారా భారతీయుల ఆత్మ గౌరవాన్ని కాపాడినందుకు, పాఠ్య పుస్తకాల్లో మన దేశం పేరుని భారత్ గా మార్పుచేసి చరిత్ర ను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి నమస్సులతో కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

‘సంగీత నాటక అకాడమి’ దక్షిణభారతీయ కేంద్రాన్ని – పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేతులమీదుగా హైదరాబాద్ లో ని శిల్పకళావేదిక లో జరిగిన (12. 2. 2024) ఒక కార్యక్రమం లో లాంఛనం గా ప్రారంభించింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా గీతా గాన ప్రవచన ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు.

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ – దక్షిణాది కళలను, కళాకారులను ప్రోత్సహించడం కోసం ‘సంగీత నాటక అకాడమి’ దక్షిణభారతీయ కేంద్రాన్ని – పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు చేతులమీదుగా హైదరాబాద్ లో ని శిల్పకళావేదిక లో జరిగిన (12. 2. 2024) ఒక కార్యక్రమం లో లాంఛనం గా ప్రారంభించింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధి గా గీతా గాన ప్రవచన ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి హాజరయ్యారు. ఈ SNA కేంద్రం లో నిర్మించే ఆడిటోరియానికి ఘంటసాల శత జయంతి నేపధ్యం లో ‘గానగంధర్వ ఘంటసాల కళా మండపం’ అనిపేరు పెట్టడం బహుధా హర్షణీయమని, ఘంటసాల ను ‘తెలంగాణ’ ప్రభుత్వాలు మరిచిపోయాయనే అనుమానం సర్వే సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణం లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి చొరవతో జరుగుతున్న ఘంటసాల ఆడిటోరియం నిర్మాణం – ఇటు ఘంటసాల పాటను, ఆయన అభిమానులను గౌరవించినట్టయ్యిందని గంగాధర శాస్త్రి అన్నారు. కేవలం ఆడిటోరియానికి ఘంటసాల పేరు పెట్టడం తో పరిమితం కాకుండా, ప్రతి సంవత్సరం ఘంటసాల పాటల పోటీలను నిర్వహించి, తగిన బహుమతులతో గాయకులను ప్రోత్సహించవలసిందని సూచించారు. అంతేకాక ‘సంగీత నాటక అకాడమీ’ సంగీత విభాగం లో ఇచ్చే అవార్డులు కూడా ఘంటసాల పేరుతోనే ఇస్తే బావుంటుందని గంగాధర శాస్త్రి అన్నారు. ” ఘం.. ట.. సా.. ల..! అనే నాలుగు అక్షరాలు నాలాంటి వేలాది మంది గాయకులకు చతుర్వేదాలతో సమానమైనవి. తెలుగు సినిమా రంగానికి ఆయన చిరస్మరణీయులు. నాకు ఆయన ప్రాతస్మరణీయులు. ఘంటసాల గారి గానం తోనే జీవితమంతా ముడిపడి ఉన్న గాయకుడు బహుశా నేనొక్కడినేమో అనిపిస్తుంది. మా నాన్నగారి ద్వారా నేను విన్న తొలి పాట – ఘనా ఘన సుందర, కాలేజీ రోజుల్లో నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ బహుమతి తెచ్చిపెట్టిన పాట – శివశంకరి, నాకు ‘ఈనాడు’ పత్రికలో రామోజీ రావు గారు జర్నలిస్టు గా ఉద్యోగం ఇవ్వడానికి కారణమైన పాట – పాడుతా తీయగా, సినీ నేపధ్య గాయకుడుగా శ్రీ దాసరినారాయణ రావు గారు అవకాశం ఇవ్వడానికి దోహదం చేసింది – పుష్పవిలాపం, భాషపై పట్టు నేర్పింది – శ్యామలా దండకం, నన్ను ఎన్ టి ఆర్, ఏ ఎన్నార్, డా సి నారాయణ రెడ్డి వంటి మహానుభావులకు దగ్గర చేసింది ఘంటసాల పాటే… ! చివరకు – ఈ దేశం లో సంపూర్ణ భగవద్గీతను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రికార్డు చేసి, విడుదల చేసి, గీతా ప్రచారానికే జీవితాన్ని అంకితం చేసిన తొలి గాయకుడు గా నాకు స్ఫూర్తినిచ్చి, నా జన్మను చరితార్థం చేసింది కూడా ఘంటసాల గారే… ! ‘ఘంటసాల గానo ప్రాంతాలకు అతీతమైనది. భగవద్గీత మతాలకు అతీతమైనది. ఘంటసాలగారి స్థానాన్ని భర్తీ చేసిన వాళ్ళు ఉన్నారేమో గాని ఆయన స్థాయిని భర్తీ చేసిన వారు లేరని నా అభిప్రాయం.. ఆ గాన యోగి గాత్రం లో ఉన్న ఆర్ద్రత, పవిత్రత, పరమ శాంతి మరే గాత్రం లోనూ నేను వినలేదు. మిగతా వారి పాటలు తేనె తాగుతున్నట్టు అనిపిస్తే, ఘంటసాల పాటలు అమృతం తాగుతున్నట్టు అనిపించేవి. ఆయన మార్గమే నా రాతను మార్చి ‘గీత’ వైపు నడిపించింది. భగవద్గీతను జీవన గీత గా గుర్తించండి. మరణ గీత గా కాదు. గీతను బాల్యదశనుండే తాత్పర్యం తో సహా పిల్లలకు నేర్పించండి. స్వార్థ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించండి..” అంటూ గాన ప్రసంగం చేశారు గంగాధర శాస్త్రి. ఈ సందర్భం గా అదే వేదికపైన గానం చేసిన కొందరు అంధ విద్యార్థులు తాము భగవద్గీత నేర్చుకుంటున్నామని చెబుతూ, శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి తమ పాఠశాలకు ఆహ్వానిస్తూ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమం లో తెలుగు కోయిల శ్రీమతి పి. సుశీల, ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, దాత శ్రీ అల్లూరి సీతారామరాజు పాల్గొన్నారు.

‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయం ను సందర్శించిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, నిస్వార్ధ, నిష్కామ కర్మయోగి శ్రీరామ స్వామి (శ్రీరామ్ సర్)….

ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, నిస్వార్ధ, నిష్కామ కర్మయోగి శ్రీరామ స్వామి (శ్రీరామ్ సర్) ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయం లో ( 10.2.2024 ) కాసేపు గడిపారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకేసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు వారిని స్వాగతించారు. అదే సమయం లో ఫౌండేషన్ లోకి తన తల్లిదండ్రులతో చిII అచ్యుత్ శర్మ అడుగు పెట్టాడు. తాను నేర్చుకున్న భగవద్గీత లోని శ్లోకాలు, పోతన భాగవతం పద్యాలు స్పష్టమైన ఉచ్చారణతో వినిపించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసాడు. ఇదంతా అతని పూర్వజన్మాభ్యాస ప్రభావమేనని, అతని తల్లి తండ్రుల పూర్వ జన్మ సత్కర్మ ఫలితమని గంగాధర శాస్త్రి అన్నారు. శ్రీ ఆజాద్ బాబు, గీతా గురువు శ్రీమతి శైలజ, ‘వేదమాతరం’ పత్రిక సంపాదకులు శ్రీ విశ్వనాథ శోభనాద్రి సమక్షంలో శ్రీ రామ్ స్వామి ఆనందభరితుడై అచ్యుత్ శర్మను ఆశీర్వదించారు.

తుర్కయాంజాల్ ( హైదరాబాద్ ) లోని కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల హనుమాన్ దీక్షితులు, వారి సోదరులు శ్రీమాన్ అర్వపల్లి వెంకట రఘురామ చక్రవర్తి….

తుర్కయాంజాల్ ( హైదరాబాద్ ) లోని కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల హనుమాన్ దీక్షితులు, వారి సోదరులు శ్రీమాన్ అర్వపల్లి వెంకట రఘురామ చక్రవర్తి తో కలిసి – తమ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భం గా, గీతా వైభవ ప్రవచనం కోసం – ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని వారి ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భం గా – హనుమాన్ దీక్షితులు తాను స్వహస్తాలతో రాసుకున్న శ్రీమద్రామాయణ లిఖిత పారాయణ గ్రంథాలను శ్రీ గంగాధర శాస్త్రికి చూపించి, రామాయణ విశేషాలను పంచుకున్నారు. ఈ సమావేశం లో శాక్రమెంటో (అమెరికా) నుంచి వచ్చిన శ్రీ ప్రభాకర రావు, ‘భగవద్గీతా ఫౌండేషన్’ అడ్వొకసీ చీఫ్ శ్రీ ఆజాద్ బాబు పాల్గొన్నారు.

శృతి శుద్ధం గా, శ్రావ్యం గా పాటలు పాడుతున్న చిరంజీవి వికాసిని కి ఆశీస్సులందించిన గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి.

‘తల్లి తండ్రులు బాల్య దశ నుండే పిల్లలకు భగవద్గీత ను నేర్పించడం ద్వారా – వారిలో నైతిక విలువలను పెంపొందించవచ్చు. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నేర్పవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించవచ్చు.. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని, స్థితప్రజ్ఞతను అందించవచ్చు. మానసిక వత్తిడి లేని జీవితం గడిపే అవకాశం కలిగించవచ్చు. తద్వారా స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించవచ్చు. ఏపని చేసినా ధర్మబద్ధం గా చెయ్యాలి. త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఫలితం దైవానికి అర్పించి చెయ్యాలి. అహంకార రహితం గా చెయ్యాలి. నిస్వార్ధబుద్ధితో చెయ్యాలి. లోకహితం కోసం చెయ్యాలి. భవబంధాలకు అతీతం గా చెయ్యాలి.’ అని తరచూ తన ప్రసంగాలలో చెబుతూ ఉంటారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ఆయన ప్రసంగాలు విన్న స్ఫూర్తి తో తమ ఇద్దరు ఆడ పిల్లలకు భగవద్గీత నేర్పించాలనే లక్ష్యం తో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కు విచ్చేసారు కెనడా వాసులైన శ్రీ వినోద్ కుమార్ రెడ్డి, శ్రీమతి అపర్ణ దంపతులు…! శ్రీ గంగాధర శాస్త్రి తొలుత

‘వసుదేవ సుతం దేవం’ అంటూ చిరంజీవులు వికాసిని, వంశిక లతో కృష్ణ ప్రార్ధన చేయించి … అటుపై ‘సర్వధర్మన్ పరిత్యజ్య’ (గీత 18-66) శ్లోకం నేర్పించడం ద్వారా వారి భగవద్గీతా అధ్యయన మార్గాన్ని ఆశీర్వదించారు. ఆ చిన్నారుల స్పష్టమైన ఉచ్చారణను అభినందించారు. వారి తల్లితండ్రులను ఆశీర్వదించారు. “శుచీనాం శ్రీమతాం గేహే… అభిజాయతే …” అని పరమాత్మ చెప్పినట్టు – సత్కర్మ చేసుకుంటే ఇటువంటి సదాచారవంతులైన తల్లితండ్రుల కడుపున జన్మిస్తారని గంగాధర శాస్త్రి అన్నారు. శృతి శుద్ధం గా, శ్రావ్యం గా పాటలు పాడుతున్న చిరంజీవి వికాసిని కి ఆశీస్సులందించారు. వీరి కుటుంబాన్ని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కు చేర్చిన ప్రముఖ సినీ నటి జయలలిత, డాII చంద్రకాంత రెడ్డి లను అభినందించారు.

‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త, డాII ఎల్ వి గంగాధర శాస్త్రి స్వచ్ఛ రాంశంకరనగర్ (రామంతాపూర్, హైదరాబాద్-) కార్యక్రమం లో (1.2.2024) పాల్గొన్నారు

‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచారకర్త, డాII ఎల్ వి గంగాధర శాస్త్రి స్వచ్ఛ రాంశంకరనగర్ (రామంతాపూర్, హైదరాబాద్-) కార్యక్రమం లో (1.2.2024) పాల్గొన్నారు. ఈ సందర్భం గా మొక్కలు నాటి, నిత్యం ప్రజల కు సేవ చేసే జి హెచ్ ఎం సి అధికారులను, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోకపోతే రోగాలు ప్రబలుతాయని తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం గా వ్యవహరించడంపై గంగాధర శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్నవారుకూడా నిరక్షరాస్యులాగా, బాధ్యతరహితం గా, సంస్కారహీనం గా ప్రవర్తిస్తూ – తిని వదిలేసిన వ్యర్ధ పదార్ధాలను, చెత్తను, రోడ్ల పై మూటలు కట్టి పడేసి వెళ్లిపోవడాన్ని మున్సిపల్ వారు సీరియస్ గా తీసుకుని, సి సి కెమెరాల ద్వారా వారిని గమనించి కఠినం గా శిక్షించాలని అన్నారు. దశాబ్ద కాలం గా తమ కాలనీ లో చుట్టు పక్కల వాళ్ళు వ్యర్ధ పదార్ధాలను తమ ఇంటి పక్కనే పడవేయడం వల్ల, ఈగలూ దోమలతో తాము తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని ఆయన అన్నారు. ఈ విషయం లో ఎన్ని సార్లు అవగాహన కల్పించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. దేవాలయ పరిసరాలను కూడా ప్రజలు శుభ్రం గా ఉంచడం లేదని, వ్యర్ధ పదార్ధాలను మున్సిపల్ వారు ఇంటింటికీ పంపించే వాహనాలకే అందించాలనే కనీస జ్ఞానం కూడా లేని సమాజం లో బతకాల్సి రావడం దురదృష్టకరమని, దీనికి కఠినమైన చర్యలు చేబట్టడమే పరిష్కారమని గంగాధర శాస్త్రి అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన బి జె పి కార్పొరేటర్ శ్రీమతి శ్రీవాణిని, మున్సిపల్ అధికారులు శ్రీ సుదర్శన్, శ్రీ బాబురావు తదితరులను శ్రీ గంగాధర శాస్త్రి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ సత్కరించారు.

‘పత్రీజీ ధ్యాన మహా యాగం’ కార్యక్రమం లో (24.12.2023) శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం…

‘లౌకికమైనవి చూస్తేనే నమ్మగలం ….ఆధ్యాత్మికమైనవి నమ్మితేనే చూడగలం … పరమాత్మను తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా, ముందు నమ్మకం ఉండాలి… అటుపై అర్హత ఉండాలి… యోగమాయ చేత ఆవరించబడి ఉండడం వల్ల పరమాత్మ కనిపించడు… అనన్యమైన భక్తి చేత మాత్రమే ఈ మాయను దాటి పరమాత్మను చేరవచ్చు. పరమాత్మే పరమ గతి అని నమ్మాలి. మనం చేసే సమస్త కర్మల ఫలితం పరమాత్మదే అని భావించాలి. ఇంద్రియ విషయాలపట్ల ఆసక్తి లేకుండా ఉండాలి. సమస్త ప్రాణుల పట్ల ప్రేమభావం కలిగి ఉండాలి… ఇవే పరమాత్మ అనుగ్రహం పొందాలనుకునే వారికి ఉండాల్సిన ప్రధానమైన అర్హతలు.’ అన్నారు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. ‘పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ’ వారి ఆధ్వర్యం లో, కడ్తాల్ లో 40 వేలమంది ప్టేక్షకుల సమక్షం లో వైభవంగా జరిగిన ‘పత్రీజీ ధ్యాన మహా యాగం’ కార్యక్రమం లో (24.12.2023) శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ‘ఏపని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ధర్మ బద్ధం గా చెయ్యాలి. స్వార్ధ రహితం గా చెయ్యాలి. లోక హితం కోసం చెయ్యాలి. ఏ పనినైతే ఎంచుకున్నామో ఆ పనికి మనమే చిహ్నమయ్యేట్టు చెయ్యాలి. ఇతరులకు స్ఫూర్తినిచ్చేట్టు చెయ్యాలి. దైవార్పణ బుద్ధి తో చెయ్యాలి. అలా కర్మలను ఆచరించేవాడే మరణాన్ని జయించగలడు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుహు.. శ్లోకం అదే చెబుతుంది.. పుట్టిన వానికి మరణము తప్పదు.. అని చెబుతూ నువ్వు శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది.. మరణించిన వానికి జన్మము తప్పదు.. అంటూ పునర్జన్మ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ జననమరణాల మధ్యలోని జీవిత ప్రయాణాన్ని లోకం గుర్తుపెట్టుకునేలా సాగించాలి.’ అన్నారు గంగాధర శాస్త్రి. నిలకడ లేని చంచలమైన చిత్తం ఏ ఏ విషయాల లో సంచరిస్తుంటుందో, ఆయా విషయాలనుండి దానిని నియంత్రించి ఆత్మయందే స్థిరం గా ఉంచడం కోసం సాధన చెయ్యాలి… ఇదే ధ్యాన యోగం..ఇలా చేయగలిగిన ధ్యాన యోగ సాధకుడే పత్రీజీ …! ధ్యానం గురించి పూర్తి అవగాహన పొందాలంటే భగవద్గీత లో ఆరవ అధ్యాయం “ఆత్మ సంయమ యోగం’ చదవండి’ అన్నారు గంగాధర శాస్త్రి. ‘ఈ ప్రపంచం లో లౌకిక, ఆధ్యాత్మిక విషయాల గురించి సమగ్రం గా చెప్పగలిగే ఒకే ఒక్క దైవ గ్రంథం, వ్యక్తిత్వవికాస గ్రంథం, ధర్మ గ్రంథం, మానవీయ గ్రంథం, మతాలకు అతీతమైన గ్రంథం…..ఒక్క భగవద్గీత మాత్రమే..! దీనిని బాల్య దశనుండే పిల్లలకు నేర్పించి మనదైన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. అలా కాపాడుకునే ప్రయత్నం బలంగా చేయకపోవడంవల్లే కన్వర్షన్ పేరుతో ఒక మతం, లవ్ జిహాద్ పేరుతో మరో మతం- హిందూ మతాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయి…”అంటూ హెచ్చరించారు గంగాధర శాస్త్రి. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, అందరూ భగవద్గీత చదవాలని సూచించారు. ఘంటసాల, అన్నమయ్య గీతాలను ఆలపించారు. బ్రహ్మమొక్కటే కీర్తన ఆలపిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆనంద నృత్యాలు చేశారు. కొన్ని భగవద్గీత శ్లోకాలను ప్రేక్షకుల చేత చెప్పిస్తూ, భగవద్గీతను చదివి ఆచరిస్తామని వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. తనకి సంపూర్ణ భగవద్గీత పాడాలని సూచించింది భారవే అని గంగాధర శాస్త్రి గుర్తుచేసుకున్నారు. చివరన పిరమిడ్ సొసైటీ చైర్మన్ శ్రీ కే విజయభాస్కర రెడ్డి – శ్రీ గంగాధర శాస్త్రి దంపతులను సత్కరించారు.

‘మార్గశిర శుద్ధ ఏకాదశి’ గీతా జయంతి సందర్భం గా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ హైదరాబాద్ లోని రామంతపూర్ లో అన్నదాన కార్యక్రమం…

‘మార్గశిర శుద్ధ ఏకాదశి’ గీతా జయంతి సందర్భం గా ప్రసిద్ధ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ‘భగవద్గీతా ఫౌండేషన్’ హైదరాబాద్ లోని రామంతపూర్ లో అన్నదాన కార్యక్రమం (24.12.2023) నిర్వహించింది. సంస్థ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఈ సందర్భం గా తన కుటుంబ సభ్యులతో పోచమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు జరిపి, గోసేవ నిర్వహించారు. అనంతరం శ్రీ గంగాధర శాస్త్రి – ఫౌండేషన్ సభ్యులు, ఫౌండేషన్ అడ్వకసి చీఫ్ శ్రీ ఆజాద్ బాబు లతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

తల్లి గర్భం లో ఉన్నప్పుడే బిడ్డలకు భగవద్గీత, విష్ణు సహస్రనామం వినిపించాలి – డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

సియాటెల్, అమెరికా లో నివసిస్తూ ఇన్ఫోసిస్ లో ఉన్నత పదవిలో పనిచేస్తున్న శ్రీ రామ్ నాథ్ సూర్యప్రకాశ్ ఆయన సతీమణి శ్రీమతి నేత్రావతి – గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఫౌండేషన్ కార్యాలయం లో ఆ దంపతులు కాసేపు గడిపారు. సియాటెల్ లో శ్రీ గంగాధర శాస్త్రి గీతా గానప్రవచనాన్ని విని స్ఫూర్తి పొందామని, ఆ స్ఫూర్తి తో తాము ప్రతి రోజూ భగవద్గీతను పఠిస్తున్నామని అన్నారు. ‘భగవద్గీత ను ఏ వయస్సునుండి పఠించాలో గురువు గారు చెబుతూ తల్లి గర్భం లో ఉన్నప్పుడే బిడ్డలకు భగవద్గీత, విష్ణు సహస్రనామం వినిపించాలన్నారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. నేను అలాగే చేసేదాన్ని.. మా అమ్మాయికి అలాగే గర్భం లో ఉన్నప్పుడే భగవద్గీత, విష్ణుసహస్రనామం వినిపించాను. అది పుట్టాక ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండేది. చదువులో చాలా తెలివైనది అయ్యింది. సంస్కారవంతురాలు కూడా.. ఏ సమస్య వచ్చినా తనకు తానే ధైర్యం గా పరిష్కరించుకుంటుంది. ఆధ్యాత్మిక బలం అలాంటిది. గీత లో చెప్పినట్టు సకల ప్రాణులను ప్రేమించగలగాలి. మా దొడ్లో పెంచే మొక్కలను మా బిడ్డల్లాగే చూసుకుంటూంటాను. గురువు గారు గంగాధర శాస్త్రి గారిని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు దొడ్లో పెంచిన ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో పాటు, కూరగాయల మొక్కల్ని కూడా చూపించాను.” అంటూ శ్రీమతి నేత్రావతి గుర్తు చేసుకున్నారు. రాంనాథ్ సూర్యప్రకాష్, నేత్రావతి దంపతులను శ్రీ గంగాధర శాస్త్రి, విశ్వతేజ లు సత్కరించారు.