“తెలుగు భాష అభ్యున్నతికే తన జీవితాన్ని అంకితం చేసి, తన రచనల ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చి, తన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేనంత శిఖర స్థాయి లో అక్షరానికి సేవలందించిన మహాకవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఆచార్య డాII సి. నారాయణ రెడ్డి గారు… ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమను పంచేదే తల్లి అయితే – జ్ఞాన దృష్టి తో చూడగలిగితే అటువంటి తల్లులు ప్రకృతి నిండా ఉన్నాయని చెబుతూ అందుకు ఉదాహరణగా – కణ కణ లాడే ఎండకు శిరసుమాడినా మనకు తన నీడను అందించే చేట్టే అమ్మ / చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ … అంటూ ‘ప్రేమించు’ సినిమాకి పాట రాస్తూ అమ్మ విలువ తెలియజేశార” ని గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి అన్నారు. ‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సినారే 93 వ జన్మదినోత్సవం సందర్భం గా హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో (23.7.2024)ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొని ఆయన గాన ప్రసంగం చేశారు. సినారే రాసిన ఖండ కావ్యాలు, తెలుగు గజళ్ళు, ద్విపదలు, ప్రపంచపదులు, సినిమా పాటలు, లలిత గీతాలతో సమాజం పైన ‘ఎన్ని యుగాలైనా ఇగిరిపోని గంధం’ లాంటి పరిమళాలు జల్లిన మహాకవి సినారె – అని అన్నారు. ఆయనను ఈనాటి కవులు స్ఫూర్తి గా తీసుకోవాలని, ధనం సంపాదించుకునే అవకాశం ఉన్నా ద్వంద్వార్థాల సాహిత్యం జోలికి ఎన్నడూ పోని, ధర్మం తెలిసిన నిష్కామ కర్మయోగి అని, విలువలతో కూడిన, స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపారని అన్నారు. సినారే ఎంతటి కవో అంతటి సంగీతజ్ఞుడు కూడా అన్నారు. కాబట్టి ఆయన పేరుతో శ్రీ ఓలేటి పార్వతీశం కు, శ్రీమతి ఎం. ఎం. శ్రీలేఖకు అవార్డు ఇవ్వడం సముచితమని అందుకు సంస్థ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ గాయకులు శ్రీ సుధాకర్ ను హృదయపూర్వకం గా అభినందిస్తున్నాననీ గంగాధర శాస్త్రి అన్నారు. భారత దేశం లో ఏ మహిళా సంగీత దర్శకురాలూ చేయనివిధం గా 80 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఎం. ఎం. శ్రీలేఖ పద్మశ్రీ పురస్కారానికి అర్హురాలని ఆయన అన్నారు. సంగీత దర్శకురాలిగా ఆమె, నేపధ్య గాయకుడిగా తాను ‘నాన్నగారు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యామని గంగాధర శాస్త్రి అన్నారు.
FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A