ఎన్టీఆర్ అంటే రాముడు .. ఎన్టీఆర్ అంటే కృష్ణుడు … ఎన్టీఆర్ అంటే తెలుగు భాష …. ఎన్టీఆర్ అంటే తెలుగుజాతి ఆత్మగౌరవం.. ఎన్టీఆర్ అంటే నటుడుగా సంపాదించుకున్న శక్తిని రాజకీయం అనే సేవ ద్వారా ప్రజల హృదయాలలో స్థిరస్థానం ఏర్పరచుకున్న కారణజన్ముడు! అలాగే అమృత గానం అంటే ఘంటసాల … ఈ ఇద్దరు తెలుగు మహనీయులనూ దయచేసి ‘భారత రత్న’ తో గౌరవించండి.” అని భారత ప్రభుత్వాన్ని కోరారు గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త ప్రసిద్ధ గాయకులు శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి. తాను సంగీతభరిత సంపూర్ణ భగవద్గీతను రికార్డు చేయడానికి ఈ ఎన్టీఆర్, ఘంటసాలలే స్ఫూర్తి అన్నారు. గాన సుధాకర్ స్థాపించిన ‘తేజస్విని కల్చరల్ అసోసియేషన్’ సంస్థ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాన్ని హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో నిర్వహిస్తూ ఎన్టీఆర్ అవార్డు ను ‘గాత్ర కంఠీరవ’ సాయికుమార్ కు అందజేశారు. ఈ సందర్భం గా గంగాధర శాస్త్రి – ఎన్టీఆర్, ఘంటసాలలకు నివాళిగా శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం లోని ‘నను భవదీయ దాసుని’ పద్యాన్ని ఆలపించారు. ఔచిత్యభరితమైన నటనతో, అద్భుతమైన గాత్రం తో ఘన కీర్తిని సంపాదించుకుని ఎన్టీఆర్ ప్రశంసలు పొందిన సాయికుమార్ ‘ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారానికి’ ముమ్మాటికీ అర్హులు అన్నారు. తమ భగవద్గీతా ఫౌండేషన్ రూపొందించిన “The Making of Bhagavadgita Documentary ” కి సాయికుమార్ గాత్రo అందించడాన్ని ఈ సందర్భంగా కృతజ్ఞతలతో గుర్తుచేసుకున్నారు. హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసారు.