“శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి నిదర్శనం … అర్జునుడు పురుష ప్రయత్నానికి నిర్వచనం … పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే అఖండ విజయమే… ఇదే భగవద్గీతా ఆచరణ ఫలితం …! ఇస్తే వద్దన్న వాడు శ్రీరాముడు… నాకివ్వమని అడిగిన వాడు శ్రీకృష్ణుడు… యత్కరోషి యదశ్నాసి (9-27) అంటూ నువ్వు చేసే కర్మము, తినే ఆహారము, హోమము చేసే హవ్యము, అర్పించే దానము ఆచరించే తపస్సు, సర్వ కర్మల ఫలితం నాకే సమర్పిస్తే మోక్షం పేరుతో నన్నే చేరతావు.. అంటాడు కృష్ణ పరమాత్మ .. ఇక్కడ అడగడం అంటే ఆయనకు అవసరమై కాదు. మనలోని అహంకారాన్ని దునుమాడి మోక్షం ఇవ్వడానికి !!! వామనుడు బలిచక్రవర్తి అహంకారాన్ని అడిగాడు … మోక్షం ఇవ్వడానికి … అలాగే శ్రీకృష్ణుడు సమస్త కర్మఫలాన్ని తనకు సమర్పించమని అడుగుతాడు ఇదీ మోక్షం ఇవ్వడానికే… !!! ” అన్నారు గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డా II ఎల్ వి గంగాధర శాస్త్రి..
గురుపౌర్ణమి సందర్భం గా (21.7. 2024) మణికొండ (హైదరాబాద్) లోని కోదండ రామస్వామి దేవాలయం లో ‘గీతా సద్గురు’ శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యం లో జరిగిన గీతా సత్సంగం లో గంగాధర శాస్త్రి పాల్గొని నిత్య జీవితం లో భగవద్గీత ఆవశ్యకతపై గాన ప్రవచనం చేశారు. గీత మతాలకు అతీతమైన గ్రంథమని, ఇది మత గ్రంథం కాదనీ, మానవీయ గ్రంథమనీ ఆయన అన్నారు. గీతను బాల్య దశ నుండే నేర్పించాలని, భగవద్గీతను చదివి అర్ధం చేసుకుని, ఆచరించి, ప్రచారం చేస్తే స్వార్ధ రహిత ఉత్తమ సమాజాన్ని చూడవచ్చని అన్నారు. “ఇది ధర్మ ప్రబోధ గీత, కర్తవ్య బోధ, వ్యక్తిత్వ వికాస గ్రంథం, నైతిక విలువలను పెంపొందించే ఉపదేశం…. సర్వమానవులకు ఆశాదీపం… సాధకులకు కల్పవృక్షం … గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే … తల్లి తండ్రులారా … బాల్యదశనుంచే మీ పిల్లలకు ఆధ్యాత్మికతను పరిచయం చేయండి.రామాయణ, మహాభారతాలు వారికి పరిచయం చేయండి. ఇవి వారికి కొండంత మానసిక స్థైర్యాన్నిస్తాయి. నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి.ఇవాళ సోషల్ మీడియా లో కనిపించే అనేక అనారోగ్యకరమైన వీడియోలకు, ఆ వీడియోల కింద సంస్కారం లేని కామెంట్లకు కారణం … వారి తల్లితండ్రులు విలువలు చెప్పి పెంచకపోవడమే… జీవితం కేవలం ధనార్జకోసమే అన్నట్టు గడుపరాదు… డబ్బు సుఖాన్నిస్తుంది కానీ శాంతినివ్వదు. సత్కర్మ, దుష్కర్మ, పాపం,పుణ్యం, ధర్మo,అధర్మం, దైవం, మోక్షం, జ్ఞానం, అజ్ఞానం, ఇంద్రియాల వ్యాపారం, త్రిగుణాలు, యజ్ఞం, దానం, తపస్సు, ధ్యానం, యోగం… ఇలాంటి పదాలన్నిటి అర్ధాలను బాల్యదశనుండే పిల్లలకు చెప్పండి… ముఖ్యం గా ఈ బాధ్యత తల్లులదే.. ఎందుకంటే బిడ్డకి తల్లే మొదటి గురువు కాబట్టి…. కేనోపనిషత్తు చెప్పినట్టు – న చేదిహావేదీన్మహతీ వినష్టిః … ఏది ఈ జన్మలో తెలుసుకొనకపోతే గొప్ప నష్టం జరుగుతుందో అదే ఉపనిషత్తు వివరిస్తుంది … ఆ సర్వోపనిషత్తుల సారమే భగవద్గీత …! ” అన్నారు గంగాధర శాస్త్రి. భారత దేశం లో హిందువులు 85 శాతం ఉన్నప్పటికీ వారిలోని హిందుత్వం బలం గా లేకపోవడం దురదృష్టం అని అన్నారు. క్రైస్తవ పాఠశాలల్లో బైబిల్ నేర్పుతున్నప్పుడు… హిందువులు స్థాపించే విద్యాలయాలలో భగవద్గీత ను నేర్పించక పోవడం అత్యంత దురదృష్టం అన్నారు. హిందువులలో బలమైన ఐక్యత ఉండివుంటె ఈ పాటికే గీత జాతీయ గ్రంథం అయ్యుండేదని, ప్రతి పాఠశాలలోనూ పాఠ్యాంశం గా అయ్యుండేదని గంగాధర శాస్త్రి అన్నారు. ప్రతి హిందువూ గీతా ప్రచారకులు కావాలని పిలుపునిచ్చారు.